summer: క్లాస్ లోనే స్విమ్మింగ్ పూల్.. యూపీ స్కూల్ ఇన్నోవేటివ్ ఐడియా!

  • ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం కోసం వెరైటీ ప్రయత్నం
  • నీళ్లలో గెంతుతూ సరదాగా ఆడుకున్న చిన్నారులు
  • తగ్గిన డుమ్మాలు.. పెరిగిన హాజరు
UP School Converts Classroom Into Swimming Pool As Temperature Soars

ఎండ వేడి నుంచి పిల్లలకు ఉపశమనం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో ఉన్న ఓ స్కూల్ వెరైటీగా ఆలోచించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఓ ప్రైమరీ క్లాస్ రూమ్ ను ఏకంగా చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లాగా మార్చేసింది. క్లాస్ రూమ్ లో దాదాపు రెండు అడుగుల మేర నీళ్లు నింపింది.

ఇంకేముంది.. నీళ్లను చూడగానే పిల్లల్లో ఒక్కసారిగా హుషారు పొంగుకొచ్చింది. విద్యార్థులంతా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఈత కొడుతున్నట్లు చేతులు, కాళ్లు ఆడిస్తూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీటీవీ న్యూస్ చానల్ తన వెబ్ సైట్ లో పెట్టింది.

ఎండలు ఎక్కువ కావడంతో స్కూల్ కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని.. అందుకే ఇలా ఇన్నోవేటివ్ గా ఆలోచించామని స్కూల్ ప్రిన్సిపాల్ వైభవ్ రాజ్ పుత్ తెలిపారు. తరగతి గదిని నీటితో నింపినట్లు తెలియడంతో విద్యార్థులు మళ్లీ స్కూల్ కు రావడం మొదలుపెట్టారని చెప్పారు. దీనివల్ల స్కూల్ కు డుమ్మా కొట్టే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పుడు పిల్లలంతా చదువుకోవడంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.

More Telugu News